రాజకీయాల్లో బ్రహ్మాస్త్రం.. బ్రాహ్మణి..!

తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్ట్ అనేక సంచలనాలను నమోదు చేస్తోంది. ఆయన అరెస్ట్ తో టీడీపీ సంక్షోభంలో కూరుపోతోంది అన్న వాదన తెరపైకి తెస్తున్న సోషల్ మీడియాకు నారా బ్రాహ్మణి సమాధానంగా మారారు.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవరాలు.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోడలు..,నటసింహానికి వారసురాలిగానే పరిచయమైన బ్రాహ్మణి.. నేడు టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా అవతరించారు. మామ అరెస్ట్ తో కుటుంబ రోడ్డుకు వచ్చింది… అత్తయ్య భువనేశ్వరి మానసికంగా కుంగిపోయారు.. భర్త లోకేష్ ఢిల్లీలో ఏపీ రాజకీయ పరిస్ధితులను ఎండగడుతున్నారు. ఇప్పుడు కుటుంబానికి.., పార్టీకి పెద్ద దిక్కు అవసరం ఉంది. అది గ్రహించే బ్రాహ్మణి తన అడుగులను మార్చుకుని.. రణరంగలా మారిన ఏపీ రాజకీయాలను ప్రశ్నించడం ప్రారంభించారు. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

భర్త లోకేష్ ఢిల్లీలో ఉంటే.. తాను జనంలో ఉంటా అన్న బ్రాహ్మణి డైలాగ్ ఇప్పుడు టీడీపీ తోపాటు సీనియర్లు పొలిటిషన్ల ను సైతం ఆలోచింపజేస్తోంది. మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్ కు సంఘీభావంగా నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తోంది కక్ష్య పూరిత చర్యలంటూ ఆమె నిలదీశారు. ఆమె మీడియాతో మాట్లాడిన తీరు అందర్ని ఆకట్టుకుంది. సంక్షోభంలో ఉన్న తన పార్టీనీ..,ముఖ్యంగా తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో.., ఎలా పట్టుకురావాలో తెలుసు అన్నట్లు ఆమె మాట్లాడిన తీరు హేమాహేమీ రాజకీయవేత్తలనే ఆలోచింపు జేసింది. మా మామను అరెస్ట్ చేశారు… రేపు నా భర్తను కూడా అరెస్ట్ చేస్తారు.. ఇంకా టీడీపీలో ఉన్న సీనియర్లును అరెస్ట్ చేస్తారేమో కానీ.. మా స్థైర్యాన్ని మాత్రం టచ్ చేయలేరు అని బ్రాహ్మణి చెప్పిన డైలాగ్స్ మీడియాలో రిసౌండ్స్ ను ఇస్తున్నాయి.

ఎన్నడూ రాజకీయాలు పట్టని బ్రాహ్మణి ఫస్ట్ టైం మీడియా ముందు బెదురు లేకుండా మాట్లాడిన తీరు.., మానసికంగా ఎదుర్కొంటున్న వేధనకు అద్దంపడుతోంది. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామీకం అని నినదించిన తీరు ఆలోచింపజేస్తోంది. రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీకి బ్రాహ్మణి పిలుపునిచ్చిన నేపధ్యంలో పార్టీలకు అతీతంగా మహిళలు పెద్ద సంఖ్యలో బయటకొచ్చి మద్దతునిచ్చారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ర్యాలీ అనంతరం జరిగిన మీడియా సమావేశం ఎంతో స్పష్టంగా సమస్యను బ్రాహ్మణి వివరించారు. అలానే మీడియా అడిగే ప్రతి ప్రశ్నకు తడపడకుండా సమాధానం చెప్పారు. తన స్టాండ్ ఎంటో అర్థమయ్యేలా ఆమె మాట్లాడిన తీరు నేడు సోషల్ మీడియాలో కామెంట్ల సునామీకి దారితీస్తోంది. నందమూరి.., నారా కుటుంబాల నుంచి మంచి నాయకత్వ పటిమ ఉన్న మరో మహిళా నాయకురాలు బయటకొచ్చారు .. ఆమె బ్రాహ్మణి.. టీడీపీలో బ్రహ్మాస్త్రం అని ప్రశంసిస్తున్నారు.