బీఆర్ఎస్ బీసీ మంత్రం..! పొన్నాలకు కేటీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బీఆర్ఎస్ పెద్దఎత్తున బీసీ మంత్రాన్ని జపిస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ విజయానికి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని తనదైన శైలిలో వాడుకుంటుంది. ఆ మొన్న టీడీపీ ఓటర్లును ఆకట్టుకునేందుకు కేసీఆర్, హరీశ్ రావులు వల్లెవేసిన ఎత్తులు, జిత్తులు అందరూ చూశారు. ఈ క్రమంలో బీసీ ఓటర్లు తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్.., బీజేపీల నుంచి అలకబూనిన సీనియర్ నేతలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు.
జనగామ టికెట్ ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పొన్నాలకు మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ లో చేరుతాను అంటే ఇంటికి వెళ్లి మరి ఆహ్వానిస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించడం చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తులో సీనియర్స్ బయటకు రాబోతున్నారని .. వారందరికీ బీఆర్ఎస్ ఎప్పుడూ తలుపులు తెరిసే ఉంటుందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ లో ఉన్న క్రమశిక్షణ కాంగ్రెస్ లో లేదు. అందుకే ఆ పార్టీని వీడి సీనియర్లంతా బయటకు వచ్చేస్తున్నారన్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్ లో తన్నుకుంటారని.., ఎద్దేవా చేశారు. గాంధీభవన్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రగతి భవన్ గేట్లు తెరిచే ఉంటాయని మేసేజ్ ను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ లవ్ లెటర్స్ పంపుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అనంతరం మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. 45 సంవత్సరాలు నిస్వార్ధంగా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసిన సీనియర్లపట్ల ఇంత అమర్యాదగా చూస్తారా..? అంటూ కంటతడ పెట్టుకున్న సంగతి తెలిసిందే. నడ మంత్రపు నాయకత్వంతో పార్టీని నట్టేట్లో ముంచుతున్న ఆ వ్యక్తికి రాజకీయ పతనం తప్పదని మరోవైపు పొన్నాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.